క్రీ.శ. 1356లో అప్పటి విజయనగర చక్రవర్తి సంగమ బుక్కరాయలు ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటికి గర్భాలయం, అంతరాలయం, ఆలయంపైన చిన్న విమాన గోపురం ఉండేది.
ఆ తరువాత ఆలయానికి రెండు, మూడు దశల్లో నిర్మాణాలు జరిగాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. అంతరాళ భవనం తరువాత ముఖ మంటపం నిర్మించారు. ఇందుకోసం ఉపయోగించిన శిలలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ముఖ మంటపం ఎవరు నిర్మించారో ఆధారం లభించలేదు.
తరువాతి నిర్మాణాలు విజయనగరాన్ని సదాశివ రాయలు పాలిస్తున్న కాలం నుంచి మొదలయ్యాయి. ఒంటిమిట్ట ఆలయ గాలి గోపురం లోపల నిర్మాణానికి సంబంధించిన రెండు శాసనాలు కనిపిస్తాయి. రెండు శాసనాల్లో ఒకటి క్రీ.శ. 1558 నాటిది. కాళయుక్తి నామ సంవత్సరం ఆషాడ శుద్ధ ద్వాదశి సోమవారం నాడు ప్రకటించారు. అరవీటి రామరాయల మమనుమడు గుత్తి తిరుమల నాయుడు అల్లుడు మాండ్రాజు నాగరాజు సిద్ధవటాన్ని పాలించాడు. సదాశివ రాయలు ఆదేశంతో నాగరాజు ఆలయం కోసం ఒంటిమట్ట గ్రామాన్ని ఒంటిమిట్టకు నాలుగు దిక్కులు ఉండే పల్లెలను సమర్పించాడు. మరో శాసనం గంగపేరూరరు తూర్పుగా ఊరివెలుపల నిలువుగా పాతి ఉంది. ఈశాసనం కైఫియత్తుల్లో నమోదై ఉన్నది. మరుసటి సంవత్సరం అంటే సిద్ధార్థ నామ సంవత్సరం (క్రీ.శ. 1559) ఆషాడ శుద్ధ ద్వాదశి నాడే నాగరాజు సదాశివ రాయలు అనుమతితో శాసనం వేయించారు. ఈశాసనంలో గంగపేరూరు గ్రామం, ఆగ్రామానికి చెల్లే తక్కిన గ్రామాలకు చెందిన రాబడి ఆలయానికి చెందుతుంది. పైరెండు శాసనాల వల్ల
లభించే ఆదాయాన్ని ఒంటిమిట్ట ఆలయానికి ఖర్చు చేయాలి. 1. నిత్యకట్టడి 2. అమృతపళ్లకు 3. అంగరంగ వైభవాలకు 4. గోపుర ప్రాకారాలకు 5. తేరు తిరునాళ్ల మహోత్సవానికి ఖర్చు చేయాలి. ఈ శాసనాల్లో నాలుగో అంశం గోపుర ప్రకారాల నిర్మాణాలు. ఈరెండు శాసనాల ప్రకారం లయం నిత్యవైభవంగా సాగాలని ఆలయం మరింత విస్తృతంగా నిరామణం కావాలని సదాశివరాయులు ఆశించాడు. ఆప్రకారం సదాశివరాయులు ఆదేశం మేరకు సిద్ధవటాన్ని పాలించిన మాండ్రాజు నాగరాజు పాటించారు. క్రీ.శ. 1558 నుంచి ఆలయానికి సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు ఈ ఆధారాలు తెలియజేస్తున్నాయి.
మాండ్రాజు నాగరాజు తరువాత చరిత్ర తెలిసినంతవరకూ సిద్ధవటం పాలకుడుగా కొండ్రాజు తిరుపతి రాజు వచ్చారు. ఈయన ఊటుకూరు యుద్ధంలో (1957-98) చనిపోయాడు. అప్పటి నుంచి సిద్ధవటాన్ని మట్లవారి అమర నాయకత్వం వచ్చింది. మట్ల ఎల్లమరాజు ఆయన కుమారుడు అనంతరాజు, ఆయన కుమారుడు తిరు వెంగళనాథ రాజను ఆయన కుమారుడు కుమార అనంతరాజు సిద్ధవటాన్ని పాలించారు. అనంతరాజు కాలానికి దాదాపు ఒంటిమిట్ట ఆలయ నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఈ లయానికి మహాప్రకారం, మూడు గాలిగోపురాలు, లోపల కల్యాణ మండలం, వంటశాల, ఎదుర్కోలు మంటపాలు నిర్మించారు. రంగ మంటపం సందర్శకులకు ఆశ్చర్యం కలిగేటట్లు తయారైంది. ఆలయానికి కొంచెం దూరంగా ఎనిమిది దిక్కుల బలి మంటపాలు ఏర్పాటు అయ్యాయి. గొప్పతేరు తయారైంది. ఆలయ ప్రాకారం వెలుపల యాత్రికులు బస చేసేందుకు మండపాన్ని కూమార అనంతరాజు నిర్మించాడు. సంజీవరాయ స్వామి ఆలయం, రామతీర్థం ఎప్పుడు తయ్యారయ్యాయో తెలియడం లేదు. మట్ల వారి తరువాత మరో వంద సంవత్సరాలకు సిద్ధరాజు అనే ఆయన జయ విజయములను నిలిపాడు.
