కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలతో అనుబంధం పెంచుకున్న నాయకుడు పూల సుబ్బయ్య. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతంలో రాజకీయ ప్రాతినిథ్యం వహించిన సుబ్బయ్య కంభంలో 1929 జూన్ 4న జన్మించారు. 1988జూన్ 23న కన్నుమూశారు. 1952లో కంభం పంచాయతీ వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి చెందిన పూల సుబ్బయ్య ఆతరువాత మార్కాపురం చేరుకుని న్యాయవాదిగా పనిచేస్తూ ప్రజలతో సంబంధాలను పెంచుకున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. మార్కాపురం, యర్రగొండపాలెం, ప్రకాశం ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న సమయంలో తాగు, సాగునీరు అందించాలనే సంకల్పంతో పోరాటం ప్రారంభించారు. వెలిగొండ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్షను రాజకీయ అంశంగా మార్చారు. ఎన్నికల్లో విజయం సాధించినా.. ఓటమి చెందినా పోరాటం ఆపలేదు. అందుకే వెలిగొండ ప్రాజెక్టుకు G.O.Ms.No.110, I&CAD, తేదీ 27-06-2005 ద్వారా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
రాజకీయ నేపథ్యం
- 1955 నుంచి 1985వరకు జరిగిన ఎన్నికల్లో పూల సుబ్బయ్య 1955, 1983, 1985 జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. 1962, 1967, 1978ఎన్నికల్లో విజయం సాధించారు.
- 1955లో మార్కాపురం నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన పూలసుబ్బయ్య ప్రత్యర్థి క్రిషికార్ లోక్ పార్టీ అభ్యర్థి కందుల ఓబులరెడ్డిపై ఓటమిని చవిచూశారు. అప్పట్లో సుబ్బయ్యకు 15,394ఓట్లు లభించగా కందుల ఓబులరెడ్డికి 23,463ఓట్లు వచ్చాయి. 8069ఓట్లతో ఓటమిని చవిచూశారు.
- 1962లో జరిగిన ఎన్నికల్లో యర్రగొండిపాలెం నుంచి సీపీఐ తరపున పోటీ చేసిన సుబ్బయ్యకు 25304ఓట్లు లభించగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన జె.రామిరెడ్డికి 14913ఓట్లు లభించాయి. 10391ఓట్ల ఆధిక్యతతో సుబ్బయ్య విజయం సాధించారు.
- 1967లో యర్రగొండిపాలెం నియోజకవర్గంలో సీపీఐ తరపున పోటీ చేసిన సుబ్బయ్యకు 26451ఓట్లు లభించాయి. ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన వై.రామయ్యకు 13780ఓట్లు వచ్చాయి. 12671ఓట్లు ఆధిక్యతతో సుబ్బయ్య విజయం సాధించారు.
- 1978లో మరోసారి మార్కాపురం నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున పోటీ చేసిన సుబ్బయ్య 28030ఓట్లు సాధించగా ప్రత్యర్థి జనతాపార్టీకి చెందిన వెన్న వెంకట నారాయణరెడ్డి 27947 ఓట్లు సాధించారు. సుబ్బయ్య 83ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
- 1983లో మార్కాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పూల సుబ్బయ్య ఓటమిని చవిచూశారు. స్వతంత్ర అభ్యర్థి వి.వి.నారాయణరెడ్డికి 40302 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి దొడ్ల చలమారెడ్డికి 20949ఓట్లు, సీపీఐ తరపున పోటీ చేసిన పూల సుబ్బయ్యకు 11087 ఓట్లు వచ్చాయి.
- 1985లో మార్కాపురం నుంచి సీపీఐ తరపున పోటీ చేసిన పూల సుబ్బయ్య 7007ఓట్ల తేడాతో ఓటమి చెందారు. సుబ్బయ్యకు 34326ఓట్లు లభించగా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుందురెడ్డప్ప కొండారెడ్డికి 41333ఓట్లు లభించాయి.