కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. పిఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన పరిపాలన బ్లాక్ ను మంత్రి ప్రారంభించారు. బీఏ ఎకనమిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావిభారత పౌరులను తయారు చేయడంలో విద్యాశాఖ కీలకమైనదని, కష్టమైనది అయినా భావిభారత పౌరులను తయారుచేసే విద్యాశాఖను కోరి తీసుకున్నట్లు తెలిపారు. విద్యాపరంగా నాణ్యత పెంచడానికి మంత్రిగా నేను ఏంచేయాలో చెప్పాలని సూచించారు. విద్యార్థులు స్పందిస్తూ ఫ్యాకల్టీ పెంచాలని కోరగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కళాశాల సమీపంలో బస్టాప్ ఏర్పాటు చేయాలని ప్రహరీగోడ నిర్మించాలని విద్యార్థులు కోరారు. కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి సబిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అధితి సింగ్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అల్లం శ్రీనివాసరావు, విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
