జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో రైతుల నుంచి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియపై. ఉద్యాన, మార్క్ ఫెడ్ శాఖల అధికారులతో సమీక్షించారు. క్వింటాల్ ఉల్లి ధర రూ.1200 /- ప్రకారం e-క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఉల్లి పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మైదుకూరు, కమలాపురం నియోజకవర్గ కేంద్రాల్లోని మార్కెట్ యార్డుల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉల్లి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలోని ఉల్లి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, నాణ్యతను పరిగణలోకి తీసుకుని కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్భందీగా నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో ఉల్లిపంట పండించిన ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన పెంచాలన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు, జిల్లా మార్క్ ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఎడి ఆజాద్ వలి తదితరులు పాల్గొన్నారు.
